Wednesday 30 January 2013

జమలాపురం శ్రీ శ్రీ వేంకటేశ్వరస్వామి


                          

                 Jamalapuram Sri Venkateswara Swamy Darsanmam


                                     జమలాపురం    శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం.
                               
                        
जमलापुरं श्री वेंकटेश्वरस्वामि दर्शनम्.



                                       ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం లో  కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసి  ఆర్తజన రక్షకుడై ,భక్తుల పాలిట కల్పవృక్షం గా , పూజ లందుకుంటున్నాడు.  ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఖమ్మంజిల్లాచినతిరుపతి  గా  సేవించుకుంటారు  ఈ పుణ్యక్షేత్రం  1000  సంవత్సరాలకు పూర్వమే సుదీర్ఘమైన పవిత్ర చరిత్ర కలిగి ఉన్నట్లు  చారిత్రక ఆథారాలు లభిస్తున్నాయి.
  
                                   ఆలయప్రవేశ తోరణ ద్వారం

                    స్థలపురాణం ;;----                 ప్రాచీన కాలం లో జాబాలి మహర్షి ఈ సమీపం లోని సూచీకొండ పై నున్న వైకుంఠ గుహ లో శ్రీవేంకటేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. జాబాలి తపస్సు కి  సంతోషించిన  స్వామి మహర్షి కోరిక మేరకు సాలగ్రామ రూపుడై  ఆ పర్వతం మీద కొలువు తీరాడు. జాబాలి మహర్షి చిరకాలం  ప్రశాంతమైన  ఈ సూచీ పర్వతం పైనే ఉండి,స్వామిని సేవించి తరించాడు.
           
                                 జాబాలి మహర్షి తపస్సు చేసిన సూచీకొండ
   
                    నూట ఎనిమిది తిరుపతులలో  ఒకటి గా జాబాలి ఇచ్చట ఒక పుణ్యతీర్థమును ప్రతిష్టించెననియు, ఆ పుష్కరిణి లో స్నానం సర్వపాప హరణ మనియు చెప్పబడుతోంది. ఆయన కాలం లో ఇచ్చట ఉన్న వైకుంఠ గుహ, కైలాసగుహ ల్లో  ఒక గురుకులాశ్రమం కూడ నిర్వహించ బడి నట్లు జనశృతి.

             
                                   స్వామి సన్నిధికి మెట్ల దారి
               
                ఆయన అనంతరం శ్రీ వేంకటేశ్వర పదపద్మారాధకుడైన పరమభక్తుడు  భారద్వాజ గోత్రీకుడైన శ్రీ ఉప్పల  యజ్ఞ నారాయణ శర్మ   స్వామి అను గ్రహ పాత్రుడై స్వామి సేవ లోనే జీవించి తరించాడు.  వంశానుగతం గా  ఆ సంతతి లోని భారద్వాజ గోత్రీకులే స్వామిని సేవిస్తూ ,తరిస్తున్నారు.  వారిలో  ఆరవ తరం వాడైన అక్కుభట్టు   వారసత్వం గా వస్తున్న అర్చకత్వాన్నే వృత్తి గా స్వీకరించాడు.  కొంత కాలం గడిచింది .వార్థక్యం వలన ఎత్తైన సూచీకొండ ను ఎక్కలేక ఒకరోజు నైవేద్యం తీసుకెళుతూ, వెళుతూనే  మార్గమథ్యం లో పడిపోయాడు.

             
                                              ఆలయ విమానం

               వార్థక్యం వలన నడచుకుంటూ పైకి వెళ్లలేక, ఆకలైనఛో దేవుడే దిగి వచ్చి, నైవేద్యాన్ని, స్వీకరిస్తాడులే అని అక్కడ నుంచే నివేదన  పెట్టాడు. కాని స్వామి చెంతకు వెళ్లి నివేదన అందించ లేకపోయాననే నిరాశ తో, బాధ తో, ఇక నీ గతి అంతే.నా బ్రతుకింతే అనుకొనుచు దుఖము తో వెనుదిరిగి నాడు. ఇంతలో ఆకాశవాణి   గంభీరధ్వని తో ఇలా పలికింది.  నేను నీ వెంట వస్తున్నాను. నీవు వెనక్కు తిరక్కుండా ముందుకు  నడవ వలసిందని స్వామి అక్కుభట్టును ఆదేశించాడు. స్వామి వెంటరాగా అక్కుభట్టు ఆనందం తో గ్రామం వైపు ప్రయాణమయ్యాడు.
                      
                                       శ్రీ స్వామి వారి  పాదముద్ర
           
  కొంతసేపటికి పిడుగుపాటు వంటి ఒక పెద్ద ధ్వని వినబడింది. ఒక్కసారిగా ఆకాశమంతా గొప్పకాంతి తో నిండిపోయింది. ఆ కాంతి చ్ఛట కొండపైకి దిగింది. అక్కుభట్టు వెనక్కితిరిగి చూశాడు. ఆ కాంతి పుంజము  నిలిచిన చోట మహాద్భుతంగా శ్రీ వేంకటేశ్వరుని పాదముద్ర   దర్శనీయమైంది. శ్రీ స్వామి స్వయంభువు గా సాలగ్రామ రూపుడై అక్కడ వెలి శాడు



                                   శ్రీ స్వామి వారి దివ్యమంగళవిగ్రహం


          . అక్కుభట్టు ధన్యుడైనాడు.  ఆనాటి నుండి భక్తులు నిత్య కళ్యాణ  రూపుడైన  ఈ వేంకటేశ్వరుని  దర్శించి, పూజించి, తరిస్తున్నారు. తదాది గా ఉప్పల వంశజు లే స్వామి సేవలో తరిస్తూ అర్చకత్వ,ధర్మకర్తృత్వ బాధ్యతలను ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్నారు.

                    
                           స్వామి వారి ద్వారపాలకులు జయ విజయులు
                               
            చారిత్రక ప్రాథాన్యం ;;------             కాకతి ప్రతాప రుద్ర చక్రవర్తి తన జైత్రయాత్రా సందర్బం గా ఓరుగల్లు నుండి ఖమ్మం మీదుగా ప్రయాణిస్తూ, కనిగిరి దుర్గమందు విడిది చేసి, అక్కడ ఒక కోటను,పళ్లెరముల బావిని  శివ కేశవ దేవాలయములను నిర్మింపజేసెను. తదనంరము తిరువూరు మార్గమున జమలవాయి దుర్గమునకు ప్రయాణమై ,మథ్యలో జాబాలి   పుష్కరిణి ని బాగు చేయించి, దేవాలయమును పునరుధ్ధరించి  సదాశివుని గుట్టపై ఈశ్వరుని ప్రతిష్టించి కోటను నిర్మించినట్లు  చారిత్ర కాధారాలు కలవని స్థలపురాణం చెపుతోంది.
              
              
              
                                           ఆలయ దృశ్యం

          అనంతరం రెండువందల సంవత్సరాలకు విజయనగర చక్రవర్తి , సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు  తన జైత్ర యాత్రా సందర్భంగా మార్గ మథ్యం లో జమలాపుర దుర్గాన్ని,   శిథిలమైన ఈ ఆలయాన్ని చూచి  విచారించి పునరుద్ధరణ పనులను చేయించి నట్లుగా శాసనముల వలన తెలియు చున్నది.          
                                            స్ధల పురాణ ఫలకం
             
                      సుమారు ఒక శతాబ్దం క్రితం తాడేపల్లి రాజు గారు దైవదర్శనానికి వచ్చి, శిథిలా వస్థ  కు చేరిన ఆలయాన్ని పునరుద్ధరింప జేశారు. శిఖరప్రతిష్ట చేసి, ఉత్సవాలు జరిపించి, నిత్య నివేదన కు భంగం కలగకుండా భూ వసతి ని కూడ కల్పించారు.  క్రీ.శ. 1964 లో  దేవా దాయశాఖ ఆథ్వర్యం లో  పునరుద్ధరణ పనులు  చేపట్టి  శ్రీ స్వామి వారి  ఆలయము,  శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాలను పునర్నిర్మించారు.  క్రీ.శ 1975 లో శ్రీశ్రీశ్రీ శృంగేరీ పీఠాథిపతి శ్రీ శంకరాచార్యుల వారి దివ్యాశీస్సులతో,  అప్పటి వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ ఉప్పల కృష్ణమోహన్ శర్మ దంపతులచే మహాసంప్రోక్షణ, విగ్రహప్రతిష్ట ,ధ్వజప్రతిష్ఠాది కార్యక్రమాలు వైభవం గా నిర్వహించబడింది
                  
                           ఉపాలయం లో కొలువు తీరిన వినాయకుడు
              
             ఇప్పటికీ  ఈ ఆలయం  వేంకట ఈశ్వర నిలయం గానే సేవించ బడుతోంది. ఒకే ప్రాంగణం  లో శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తో పాటు  శివాలయం కూడ  మనకు దర్శనమిస్తుంది.  స్వామికి ఎడమవైపునున్న శ్రీ అలమేలు మంగమ్మ కొలువు తీరి ఉంది. ఆలయ  ప్రవేశం లో తోరణ ద్వారానికి రెండు వైపులా రెండు ఉపాలయాలు  ఎదురదురు గా నిర్మించబడ్డాయి. కుడివైపు ఉపాలయం లో విఘ్ననాయకుడైన వినాయకుడు  సాక్షిగణపతి వలే కొలువు తీరి భక్తులను కంటికి రెప్పవలె కాపాడుతుంటాడు.
                  
              
                               ఉపాలయం లో కొలువు తీరిన వీరహనుమాన్                

           ఎడమవైపు ఉపాలయం లో రామబంటు  వీరాంజనేయుడడై ఆర్తజనరక్షకుడై కొలువు తీరి ఉన్నాడు.  దూరం గా అశ్వత్థవృక్షం క్రింద నాగశిల పూజ లందుకుంటోంది. వాహన పూజలు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆటోలు , కార్లు  ద్విచక్రవాహనాలు ఎప్పుడూ పూజలకు బారులు తీరి ఉంటాయి. 

  
                                    నాగ శిల్పము

               వసతి సౌకర్యాలు ;;-----          తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారం తో యాత్రికుల వసతి కోసం 12 గదుల ధర్మశాల నిర్మించబడింది. కళ్యాణమండపం కనుల పండువగా రూపుదిద్దుకుంది. భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, స్నానాలగదులు నిర్మించబడ్డాయి. కొండకు చేరుకోవడానికి సుందరమైన సోపాన పంక్తి  అమర్చబడ్డాయి .
            
                                పొంగళ్ల మండపము
              
            ప్రతి శనివారం వందలాది భక్తులు స్వామిక పొంగళ్లు సమర్పించుకోవడం ఆనవాయితీ. అందుకు వీలుగా  భక్తుల విరాళాలతో పెద్ద పొంగళ్ల మండపం నిర్మించబడింది. ఆలయం పరిసరాల్లో ఎప్పుడూ తిరునాళ్ళ వాతావరణమే కనిపిస్తుంది. బొమ్మలు,మిఠాయిలు  ప్లాస్టిక్ సామానులు, దేవుని పటాలు, పసుపు ,కుంకుమ ,గాజులు అమ్మే దుకాణాలు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. గిరి ప్రదక్షిణం చేయవచ్చు. అనుకూలంగా రహదారి ఉంటుంది. అలాగే  ప్రధాన ఆలయం వరకు ఘాట్రోడ్డు కూడ ఉంది.
                      

                                     అద్దాలమేడ లో శ్రీ వేంకటేశ్వరుడు

            శ్రీ స్వామివారి పవళింపు సేవకు అందమైన అద్దాల గది భక్తుల విరాళాలతో  మనోహరంగా   తీర్చిదిద్దారు .

                       పొంగళ్లమండపం ముందు శ్రీ కృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహం

                ప్రత్యేక ఉత్సవాలు ;;----           ప్రతి శనివారము స్వామివారికి ఉత్సవమే. అంతే కాకుండా వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు, చైత్రశుద్ధ సప్తమి రోజున జరిగే కళ్యాణోత్సవము, శరన్నవరాత్రి ఉత్సవాలు ఫ్రత్యేక ఉత్సవాలు. ఈ  ఉత్సవాలు,పూజలు అన్నీ ఋగ్వేద స్మార్తాగమానుసారం గా జరుగుతాయి.  ఈ ఉత్సవాల్లో  భక్తులు వేలాది గా పాల్గొని. స్వామి అనుగ్రహానికి పాత్రులౌతుంటారు.


                        ఆలయ రమణీయ దృశ్యం

              రవాణా సౌకర్యాలు.::------              ఈ పుణ్య క్షేత్రానికి చేరుకోవడానికి మథిర, మైలవరం,తిరువూరు లనుండి ఆర్టీసీ పెక్కు సర్వీసులను నడుపుతోంది . విజయవాడ ,కంచికచర్ల నుండి కూడ ఆర్టీసీ సర్వీసులున్నాయి. కంచికచర్లనుండి సుమారు 35 కి.మీ దూరం లోను.విజయవాడ.ఖమ్మం ల నుండి సుమారు 80 కిమీ దూరంలోను, ఎర్రుపాలెం రైల్వేష్టేషన్ నుండి 5 కి.మీ దూరం లోను ఈ పుణ్యక్షేత్రం ఉంది. స్వంత వాహనం ఉంటే ప్రయాణం సుఖకరం గా ఉంటుంది. కాఫీ, భోజన హోటళ్లు  గ్రామీణతరహా  లోనే ఉంటాయి.
        ఖమ్మం జిల్లా లో భద్రాచలం తరువాత పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రం ఈ జమలాపురం. శ్రీనివాసుడు ఎక్కడ వున్నా శ్రీ  నివాసుడే కదా.!!!
                    
                                  
                                   




                                      श्रिय: कान्ताय कळ्यणनिधये निधये2र्धिनाम् !
                      श्री वेंकटनिवासाय श्रीनिवासाय मन्गळम् !!








*********************************************************************************

Monday 28 January 2013

అహోబిలం - నవ నారసింహక్షేత్రం


        
                Ahobilam -Nava Narasimha Kshetram     

                 अहोबिलं -नवनारसिंहक्षेत्रं
           
                అహోబిలం  -    నవ నారసింహక్షేత్రం
          
                     ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి  ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం..కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరం లోను, నంద్యాల నుండి  65 కి.మీ, దూరం లోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.
      
                              ఎగువ అహోబిల రాజ గోపురం

        స్థలపురాణం ;;-----        ఇందుగల డందు లేడని సందేహము వలదని,  హితవు పలికి – చక్రి సర్వోప గతుండని  ప్రకటించిన  ప్రహ్లాదుని  విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా  ఉంచడానకి,   స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర  నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది.    ఇచ్చట హిరణ్యకశిపుని  గోళ్ల తోచీల్చి  సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు ----
                 अहोवीर्यं अहोशौर्यं अहोबाहुपराक्रमं
                 नारसिंहं परं दैवम् अहोबिलं अहोबलं !!”
 అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ  క్షేత్రం అహోబలం అని పిలువబడుతోందని స్ధల పురాణం.  ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన    ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు  స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం ,  అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం.   హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం  ఇంకా చల్లారని ప్రతాపం తో  నరసింహుడు అరణ్యం లో  గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో   సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని  భావించబడుతోంది.
                
            

                                 ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం

              వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు  భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు.  జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు  చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.
                

                                          రాజగోపుర దృశ్యం
              
                 నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం  అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో  దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను  నరసింహ రూపుని గా    దర్శన మీయ వేడుకున్నాడు.  ఆనాడు  గరుడునికి స్వామి  సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట. 
            ज्वालाङोबिल मालोल क्रोड करंज भार्गव
         योगानंद छत्रवट पावन नवमूर्तय : !!      
జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన   నార సింహ  అను  తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద  కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో  లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై  భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం  వలన వాని  ఫలితాలు కూడ  వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది.  అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో   ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.
     ఆలయప్రత్యేకత  ;;;;------
                శ్రీ భార్గవ  నరసింహ స్వామి ;;---        దిగువ  అహోబిలానికి  2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే అక్షయ తీర్థం ఉంది. ఈ అక్షయ తీర్థం లో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. .పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు.అందువలన ఈ అక్షయ తీర్థాన్నే భార్గవ తీర్థమని కూడ పిలుస్తారు.
    
              శ్రీ యోగానంద నరసింహ స్వామి;;-     వీరు దిగువ అహోబిలానికి  తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు.  స్వామి  ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను  నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నిక కన్నది.   కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే   స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.
     
       శ్రీ  ఛత్రవట నరసింహస్వామి ;;----   ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో  వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను  అభ్యసించేవారు ఈ  స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద  గలుగుతారు .

  
           శ్రీ  అహోబిల నరసింహస్వామి ;;----            నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు  మతిమాంద్యాలు, ఈ స్వామిని  సేవించడం వలన పటాపంచలౌతాయి.
     
          శ్రీ వరాహ నరసింహస్వామి;;-----     ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే  క్రోడ నరసింహ స్వామి  అని కూడ పిలుస్తారు.


               శ్రీ మాలోల నరసింహస్వామి ;;----       ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి  మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.
       
                               శ్రీ మాలోల  నరసింహ స్వామి

       శ్రీ జ్వాలా నరసింహస్వామి;;---       ఈ స్వామి  ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని అచలాచయ మేరు అని కూడ పిలుస్తారు..హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి,చెండాడిన  నరసింహస్వామి ఇక్కడ   కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే,సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి.  మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ రక్తకుండం అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందు లో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత  రక్తసిక్తమైన తన  చేతులను ఈ పుష్కరిణి లోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱ గా ఉండిపోయింది.

      

         శ్రీ పావన నరసింహస్వామి::---    ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి  ఉన్నాడు.  నవ ఆల యాల్లో   ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది.అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను,పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ  తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితం గా సగం స్వీకరించి   మిగతా సగం  ప్రసాదం గా ఇచ్చివేస్తాడని ప్రతీతి.
    
     
                                 శ్రీ పావన నరసింహస్వామి                          

         శ్రీ  కరంజ నరసింహస్వామి ;;---         ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని  సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని  చెపుతారు.
      
                            శ్రీ కరంజ నరసింహస్వామి

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి;;--              ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి  కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు  గల సంబంధాన్ని కూడ భక్తులు  విశ్లేషించుకుంటున్నారు.
    చారిత్రకప్రాధాన్యం .;;---            దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది.  ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతుల తో  నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ  స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల  విలాసాలు మనకు కన్పిస్తాయి . పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు,  నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువు తీరి  కనువిందు చేస్తాయి .
               

        ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది.  ఆలయానికి బైట  కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి.  ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి   శ్రీకృష్ణదేవరాయలు  దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర   చక్రవర్తి  దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది.  కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో  ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.              
                 
             

                                                  దిగువ అహోబిల రాజగోపురం
              
               తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు  లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం  అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు  చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.
                               
                                ఉగ్ర నరసింహుని సుందర రూపం

 ఉగ్ర స్థంభం  :----   ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ  ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.  
                                         उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं
                                          नृसिंहं भीषणं भद्रंमृत्युर्मृत्युं नमाम्यहम्.!!
  
                                  అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు.
  
    
                                          ఉగ్ర  స్థంభం

ప్రహ్లాదమెట్టు;;---       ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి  మధ్య లోని  ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం  దర్శన మిస్తుంది.   ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.  

                                    స్థంభ శిల్పం
        
       అహోబిలమఠం.::----- ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర  సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను  ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు  ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.
           
                       చెంచులక్ష్మీ నరసింహుల స్థంభ శిల్పం

                  ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు  శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ  కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా  ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.


                      
                        రంగమండపం లోని  స్థంభ శిల్పం

           ప్రత్యేక ఉత్సవాలు::------    ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.
     

                                   యోగానంద నరసింహ స్థంభ శిల్పం
   
   ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో  వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.






**********************    स्वामी नृसिंह: सकलं नृसिंह: **********************************